కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది.. కేసీఆర్ వైపు చూస్తున్నారు: కేటీఆర్

  • పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
  • స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపు
  • అందరితో మమేకం కావాలని, గెలుపు గుర్రాలకు పోటీకి అవకాశం కల్పించాలన్న కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, తెలంగాణ ప్రజానీకం బీఆర్ఎస్, కేసీఆర్ వైపు చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈరోజు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

క్షేత్రస్థాయిలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లను ఆదేశించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. అందరితో మమేకం కావాలని, గెలుపు గుర్రాలకు పోటీకి అవకాశం కల్పించాలని కేటీఆర్ సూచించారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక సమస్యలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. పల్లె ప్రగతి పేరిట గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ హయాంలో చేసిన కార్యక్రమాలు, వాటి ఫలితాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు.

ప్రస్తుతం పల్లెల్లో నెలకొన్న పరిస్థితిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. బతుకమ్మ పండుగకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని, తెలంగాణ సంస్కృతి పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. స్థానికంగా బీఆర్ఎస్ నేతలు బతుకమ్మ కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు.

KTR
K Taraka Rama Rao
BRS
Telangana
Telangana Politics
KCR
Congress Government
Local Body Elections

More Telugu News